
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భక్తుల సౌకర్యార్థం కీలక నిర్ణయం తీసుకుంది. కోటి విరాళం చెల్లించే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించింది. ప్రత్యేక ఉత్సవ రోజుల్లో మినహా అన్ని రోజుల్లో ఈ ప్రత్యేక సౌకర్యాలు పొందవచ్చని తెలిపింది. రూ. కోటి విరాళం ఇచ్చే దాతతో పాటు మరో నలుగురికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించనున్నట్లు పేర్కొంది.
విరాళం ఇచ్చే దాతకు ఏడాదిలో మూడ్రోజులు సుప్రభాత సేవ (Tirumala Suprabhata Seva), 3 రోజులు బ్రేక్ దర్శనం, 4 రోజులు ప్రత్యేక ప్రవేశ దర్శనం సౌకర్యం ఉంటుందని టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే దాతలకు ఏడాదిలో ఒకసారి వేదాశీర్వచనం పొందే వెసులుబాటు ఉంటుందని వెల్లడించారు. వీటితోపాటు 10 పెద్ద లడ్డూలు, 20 చిన్న లడ్డూలు, దుప్పటి- 1, రవికే – 1, మహా ప్రసాదం ప్యాకెట్లు – 10, ఒక సారి వేద ఆశీర్వచనం వంటి సౌకర్యాలను పొందవచ్చని చెప్పారు. వీటితో పాటుగా రూ. 3 వేలు రుసుం విలువ చేసే వసతి గదుల సదుపాయం 3 రోజులు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. జీవిత కాలంలో ఒకసారి దాతకు ఒక 5 గ్రాముల శ్రీవారి బంగారు డాలర్, ఒక 50 గ్రాముల సిల్వర్ డాలర్ ను తగిన ఆధారాలను కార్యాలయం వారికి చూపించి పొందవచ్చని వివరించారు.
కాటేజ్ డొనేషన్ స్కీం, ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ (SV Pranadana Trust), ఎస్వీ విద్యాదాన ట్రస్ట్, బర్డ్ ట్రస్టు, శ్రీవేంకటేశ్వర అన్నదాన ట్రస్ట్, శ్రీవేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, శ్రీవేంకటేశ్వర సర్వశ్రేయాస్ ట్రస్ట్, శ్రీవేంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, శ్రీవాణి ట్రస్ట్, శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ట్రస్ట్, శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదినీ స్కీమ్ (స్విమ్స్) లకు దాతలు విరాళాలు చెల్లించి సంబంధింత సౌకర్యాలను పొందవచ్చు. దాతలు టిటిడి వెబ్ సైట్ అయిన www.ttddevasthanams.ap.gov.in లో ఆన్ లైన్ ద్వారా విరాళాలు చెల్లించవచ్చు. ఆఫ్ లైన్ లో అయితే దాతలు ఈవో, టిటిడి పేరిట డి.డి/ చెక్ లను తీసుకుని తిరుమలలోని దాతల విభాగంలో ( డోనార్ సెల్) అందజేయాలి.